ఐటీ దాడుల్లో పట్టుబడిన రూ.351 కోట్ల నగదు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ ఆయన బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత కొన్ని రోజులుగా దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని కట్టలు కట్టలు నగదు బయటపడుతోంది. ఇప్పటి వరకూ సుమారు రూ.350 కోట్లకు పైనే స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.మొత్తం పట్టుబడ్డ నగదు 351 కోట్ల రూపాయలని అధికారులు ప్రకటించారు. ఐటీయే కాదు, ఏ ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఏకదాడిలో ఇంత పెద్దమొత్తంలో అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకోవడం దేశంలో ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా సంస్థల్లో దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. మరోవైపు పట్టుబడిన మొత్తం ధనాన్ని అధికారులు ఒకే బ్యాంక్లో డిపాజిట్ చేయనున్నారు.దాడుల్లో ఇప్పటి వరకూ పట్టుబడిన ఈ మొత్తం సొమ్మును బలంగీర్లోని ఎస్బీఐ ప్రధాన శాఖలో డిపాజిట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎస్బీఐ రీజినల్ మేనేజర్ భగత్ బెహరా మాట్లాడుతూ.. తమకు మొత్తం 176 బ్యాగులు అందినట్లు చెప్పారు. ఇప్పటివరకూ 140 బ్యాగుల్లోని మొత్తాన్ని లెక్కించినట్టు చెప్పారు. మిగిలిన బ్యాగుల్లోని నగదును నేడు లెక్కించనున్నట్లు వివరించారు. మొత్తం మూడు బ్యాంకులకు సంబంధించిన అధికారులు ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారని చెప్పారు. సుమారు 40 లెక్కింపు యంత్రాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. అందులో 25 మెషీన్లను వినియోగిస్తున్నామని.. మరో 15 బ్యాకప్గా ఉంచినట్టు ఆయన వివరించారు.
రికార్డు స్థాయిలో..
గతంలో 2019లో కాన్పూర్ కేంద్రంగా ఉన్న ఒక వ్యాపార సంస్థపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు దాడి చేసి 257 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దేశంలో అదే పెద్ద మొత్తం. అలాగే తమిళనాడులో ఒక నిర్మాణ సంస్థపై ఐటీ అధికారులు 2018లో దాడి చేసి రూ.153 కోట్లను పట్టుకున్నారు. ఈ రికార్డులన్నీ ఒడిశా ఐటీ దాడితో తుడిచిపెట్టుకుపోయాయి.కాగా ఈ నెల 6న ప్రారంభమైన ఐటీ దాడులు ప్రధానంగా బల్దేయో సాహు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు అనుబంధంగా ఉన్న బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ (బీడీపీఎల్)పై కొనసాగాయి. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూకు చెందిన రాంచి, ఇతర ప్రదేశాల్లోని సంస్థలపై కూడా దాడులు జరిగాయి. అయితే వాటి నుంచి ఎంత నగదు, ఏంఏం పత్రాలు స్వాధీనం చేసుకున్నారన్న వివరాలను మాత్రం ఐటీ అధికారులు ఇంకా వెల్లడించలేదు.