స్మార్ట్ మీటర్ల వెనుక రూ.6500 కోట్ల కుంభకోణం
- మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రైతులు వ్యతిరేకిస్తున్నా.. పంపు సెట్లకు మీటర్లు పెట్టాల్సిందేనని ప్రభుత్వం బలవంతం చేస్తోందని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కొత్త అప్పుల కోసమే వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల వెనుక రూ.6500 కోట్ల కుంభకోణం ఉందని ఆరోపించారు. నాలుగేళ్ల కాలంలో 8 సార్లు కరెంటు ధరలు పెంచిన ఘనత సీఎం జగన్దే అంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయపు పంపుసెట్లకు మీటర్లు పెడితే, ఒక్కో రైతు పైనా రూ.29,500 భారం పడుతుందన్నారు. రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం పాలన చేస్తుందని దుయ్యబట్టారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని 20 రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు. ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్ల పెడుతున్నారన్నారు. రైతుల మెడలకు ఉరి తాళ్లు వేసేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికి రాష్ట్రంలో 3000 మందికి పైగా రైతుల ఆత్మహ్యలు జరిగాయన్నారు. ఏపీలో పూర్తిగా వ్యవసాయ రంగం నష్టపోయేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. రైతులకు విత్తనం దొరకదని.. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా ఈ ప్రభుత్వంలో దక్కడం లేదని ఆలపాటి రాజా విమర్శించారు.