దసరా సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి.. వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బ‌హుమ‌తులు అందించనుంది. ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది. ఈ నెల 21 నుంచి 23 తేది వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఆయా తేదిల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలి. బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో పురుష, మహిళలకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేయనుంది. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్ లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. మొత్తం 11 రీజియన్ లలో కలిపి 110 విజేతలను ఎంపిక చేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులను అందజేస్తారు. సెప్టెంబర్ 31 న రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ లక్కీ డ్రా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ లక్కీ డ్రాకు మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేసి వారికి రూ.5.50 లక్షల నగదు పురస్కారం అందజేసి ఘనంగా సంస్థ సత్కరించింది. రాఖీ పౌర్ణమి స్పూర్తితో దసరా, దీపావళి, సంక్రాంతి, తదితర పండుగలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది.

Leave A Reply

Your email address will not be published.