తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. నేడు బీజేపీ అధిష్టానం పెద్దలను ఆయన కలవనున్నారు. అధిష్టానం పెద్దల పిలుపుతో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో ఆయన పదవి విషయమై రకరకాల ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బండి సంజయ్ కూడా తాజాగా కార్యకర్తల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన వరంగల్లో జరిగే ప్రధాని మోదీ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో హాజరౌతానో లేదోనని బండి సంజయ్ ఆదివారం హన్మకొండలో కార్యకర్తలతో అన్నారు. రాష్ట్ర పార్టీ బాధ్యతలను బండి సంజయ్ నుంచి తప్పించి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటారని.. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమిస్తారని ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ పార్టీ కేడర్లో జోష్ నింపే ఆయన.. ఆదివారం ముభావంగా ఉండిపోయారు.8న ప్రధాని మోదీ వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి అక్కడ ఏర్పాట్లను సమీక్షించిన సంజయ్.. అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. వరంగల్లో జరిగిన మీడియా సమావేశంలో తన సహజశైలికి భిన్నంగా ముక్తసరిగా మాట్లాడారు. ఒకవేళ పార్టీ రాష్ట్ర బాధ్యతల నుంచి తనను తప్పించినా.. అధైర్యపడవద్దని బండి సంజయ్ తనను అభిమానించే కార్యకర్తలు, నాయకులకు బండి నచ్చజెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేస్తున్నారు. అయితే, బండివల్లే తెలంగాణలో బీజేపీకి గ్రామీణ స్థాయి వరకు విస్తరించిందని, పోరాట స్ఫూర్తితోనే గ్రామాల్లో అధికార పక్ష నేతల అరాచకాలను ఎదుర్కొన్నామని కార్యకర్తలు ఆదివారం ఆయనతో అన్నారు. బండినే అధ్యక్షుడిగా కొనసాగించాలంటూ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా.. బండి సంజయ్ మనస్తాపానికి గురైన విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లిందని.. దీనిపై వారి నిర్ణయం ఏమిటో ఒకటి, రెండు రోజుల్లోనే తేలిపోతుందని.. కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఈ సస్పెన్స్ త్వరలోనే తెరపడుతుందని.. పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు.