విద్యా, వివేకం, విచక్షణ, సమతుల్యతను చాటిచెప్పిన సర్వేపల్లి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బోధన అత్యుత్తమ కళలలో ఒకటి. ఈ కల ద్వారా ఉపాధ్యాయుడు అత్యుత్తమ ప్రాణియై మానవుని తీర్చిదిద్దుతాడు. మనుషులను, మనసులను మొదట అర్ధపరిచి, ప్రకృతి స్పర్శకు, సామాజిక గమన సూత్రాలకు, స్పందించేలా కృషి చేస్తాడు. ఈ వెలుగులో ఆవిద్య అజ్ఞానముల నుండి భారతీయ సమాజాన్ని విద్యావిలుగుల వైపు మళ్లింప చేయడంలో దిక్సూచిగా పనిచేస్తాడు. అలాంటి ఉపాధ్యాయులలో అగ్రగన్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. దేశము, విద్వేషము, హింస, మూడత్వంతో బందీ అయిన నేపథ్యంలో నైతిక విలువల ప్రాతిపదికగా శాంతి స్థాపనకు విద్యా చోదక శక్తిగా పనిచేస్తుందని నమ్మి ఆ మార్గంలో దారి దీపంగా పనిచేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేక ఉన్నత స్థాయి పదవులు నిర్వహించారు. రాష్ట్రపతిగా భారత ప్రధమ పౌరుడుగా ఉన్నా కూడా, తనను తాను ఉపాధ్యాయుడుగా చెప్పుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. జీవితాంతం, వసుదైక కుటుంబం భావనను నిర్విరామంగా ప్రచారం చేశారు. కుటుంబం స్థాపనకు, విద్యా, సైన్సు, ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ సాధనాలుగా ఉపకరిస్తాయని భావించి వాటిని ప్రజలలో తీసుకెళ్లడానికి అంకితభావంతో పనిచేశారు. భారతీయ విద్యా వ్యవస్థ పటిష్టతకు తపించారు. ప్రేరణ, లక్ష్యాలు లేని విద్య, సాంస్కృతిక విలువలను హరింప చేస్తుందని, సాంస్కృతిక సాగు స్వభావాన్ని విద్య సంతరించుకున్నప్పుడే విద్యార్థులు అంకితభావంతో జాతి నిర్మాణంలో పాల్గొంటారని సూత్రీకరించారు. ” శారీరక శ్రమ నుండి మానసిక శ్రమను వేరు చేయటం సరికాదు. విద్యను శ్రమతో జోడించాలని, విద్యా వివేకాన్ని, మంచి చెడులను గుర్తించే విచక్షణ, సమతుల్యతను ఇచ్చేదిగా ఉండాలని” అన్నారు. అలాంటి మహోన్నత ఆచార్యుడు జన్మదినం నేడు.
“పాఠశాల లేని పల్లెటూరు అయినా ఉండవచ్చు ఏమో గాని, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు” అని అన్నారు. పాఠశాలకు, బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికి సంబంధం పాఠశాల ప్రాంగణముతో ముడి పెట్టకూడదు. ఉపాధ్యాయుడు అంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తి కానక్కరలేదు. బతుకుతెరువు కోసం పాఠాలు చెప్పుకునే ప్రతి వ్యక్తి ఉపాధ్యాయుడే . బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తులు ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానము అత్యున్నతమైనది. ఆయన బోధించే సారాంశము, పాఠాలతో ప్రత్యేక సంబంధం లేనిదైన అది విద్యార్థి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది. విద్యార్థి సంఘానికి దేహం వంటి వాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ఏటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల మీదే కాదు, సమాజం మీద కూడా ఉంది. అదృష్టవశాత్తు సంప్రదాయాలకు పెద్దపీట వేసే మన దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానమే ఉంది. అందుకే సర్వేపల్లి జన్మదినం రోజున ఏటా సెప్టెంబర్ 5వ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. పుట్టినరోజున తనని అభినందించడానికి వచ్చిన అభిమానులను ” ఈరోజు నన్ను అభినందించడం కంటే ఉపాధ్యాయులను అభినందించడం నాకు ఎక్కువ ఆనందాన్నిస్తుందని” సర్వేపల్లి అనడంతోనే ఆ రోజు నుంచి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్థుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవము. విద్యార్థి చేసే ప్రతి ప్రయత్నానికి గురువు ఆశీస్సులు ఉంటాయి. ఉత్సాహ ప్రోత్సాహాలు ఉంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్థి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చేయలేడనే వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబం లాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యత నిర్వహిస్తున్న గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. గురువు జీవితాన్ని మారుస్తాడు. తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబం మీద ప్రభావం చూపవచ్చు. గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. విద్యార్థుల మనసును విశ్లేషించడంలో ఉపాధ్యాయుడు ఎంతో ముందుంటాడు. అందుకోసం విద్యార్థితో ఎంతో చనువుగా మెలుగుతాడు. అతనితో స్నేహం చేస్తాడు. అతనిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇదంతా జరగాలంటే ఉపాధ్యాయుడికి ఎంతో సహనం అవసరం. సంఘములో ప్రతి వృత్తిని తనలో ఇముడుచుకుని తానే అన్ని వృత్తులని నిర్వహించేవాడిగా విద్యార్థికి సంపూర్ణ అవగాహన కలిగేటట్టు చేస్తాడు. ఉపాధ్యాయుల చేతిలో విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది. వృత్తి పట్ల నిబద్ధత ప్రేమ ఉంటుందో అటువంటి వాళ్లే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలి. ఉన్నత విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు, పరిశోధకులు, పరిశ్రమ, సేవా రంగాల అభివృద్ధి కే కాక విద్యా వ్యవస్థ అభివృద్ధికి కూడా దోహదపడాలి. ఉపాధ్యాయుడు అంటే కేవలం ఉపన్యాసకుడు కాదు. సామాజిక పరివర్తనై ఉండాలి. విద్యార్థి కూడా ఆ విద్యాలయంలో తన విద్య పూర్తికాగానే ఉపాధ్యాయులతో తన పని పూర్తి అయిపోయింది అనుకోకూడదు. ఉపాధ్యాయుడు దగ్గర నుంచి తాను నేర్చుకున్న నడవడిక, క్రమశిక్షణ మాత్రమే అతను ఉన్నత స్థానానికి ఎదిగేందుకు దోహదపడతాయి. బోధనా రంగంలో మహిళల వాటా పెరుగుతుంది. ఉన్నత విద్యలో ముందంజలో ఉంటున్న మహిళలు బోధనా రంగంలోనూ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017-18లో బోధనా రంగంలో 58% పురుషులు ఉండగా 42 శాతం మహిళలు ఉన్నట్లు లెక్కలు తేల్చింది. దేశంలోనే ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమగ్ర వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సేకరించింది. 2017-18 లెక్కల ప్రకారం దేశంలో 12,84,755 మంది అధ్యాపకుల సమగ్ర వివరాలను సేకరించినట్లు వెల్లడించింది. వారిలో పురుషులు 7,45,158 మంది ఉండగా, మహిళలు 5,39,597 మంది ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముందంజలో ఉన్నాయి. దేశంలో సగటున 78% కాలేజీలు ప్రైవేట్ రంగంలో ఉండగా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 82% కాలేజీలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయని, ఆ తర్వాత 76.2% తమిళనాడు మూడో స్థానంలో ఉంది. అయితే అస్సాంలో మాత్రం కేవలం 12%, చండీగర్లో 8 %, ప్రైవేట్ విద్యాసంస్థ ఉండటం గమనార్హం. అప్పట్లో విద్యాభ్యాసం ముగించు కొన్నాక విద్యార్థులను ఉద్దేశించి గురువులకు అర్థవంతమైన మాటలు చెప్పేవారు. స్నాతకోత్సవ సమావేశాలలో ప్రస్తుతం వినిపిస్తున్న సందేశాలను తలపించే మాటలవి. ఎప్పుడూ నిజాలే మాట్లాడు, బాధ్యతలను ఎన్నడూ ఏనాడు విస్మరించకు, నిరంతర అధ్యయనం ద్వారా ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండటం అలవాటుగా మార్చుకో . ధర్మం తప్పకుండా సత్య పదం వీడకుండా వ్యవహరించు. సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడే పని చెయ్యి. అనుక్షణం నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ శిఖరాగ్రానికి గురి పెట్టి పని చెయ్యి. విజ్ఞాన సమపార్చన పై దృష్టి పెట్టు. నీవు నువ్వు ఏమి నేర్చుకున్నా ఆ జ్ఞానాన్ని మిగిలిన వారితో పంచుకో. దేవుడిని, పెద్దలను గౌరవించు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, అతిధులను దైవముగా భావించి గౌరవించడం అలవాటు చేసుకో. నిరంతర విశ్లేషణ ద్వారా మంచి చెడుల మధ్య తేడా తెలుసుకో. చెడుకు దూరముగా మెలుగుతూ, ఎప్పుడూ మంచి చేయడం మీదే దృష్టి పెట్టు. మీ ఉపాధ్యాయుడు జీవితంలోని మంచిని తెలుసుకొని ఆ బాటలో నడువు. నీ గురువుల కంటే మంచివారిని ఉత్తములను మున్ముందు నువ్వు కలుసుకోగలవు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు సంపూర్ణ సమర్పణ భావంతో సంతోషముతో, వినయముతో ఆ పని చెయ్యి. మంచి చెడులను అర్థం చేసుకోవడంలో ఎప్పుడైనా సందేహం వస్తే నీ చుట్టుపక్కల ఉన్న ఉత్తమ జీవితాల నుండి పాఠాలు నేర్చుకో. ఆలోచన నైపుణ్యాలకు నిరంతరం పదును పెట్టుకోవడం, జీవితాంతం విద్యార్థిగా ఉండటం, నేర్చుకున్న చదువును సామాజిక ప్రయోజనానికి ఉపయోగించాలని చెప్పటం, అవతలి వారి పట్ల సానుభూతి, పెద్దల పట్ల గౌరవం, సంస్కారం, వినయం వంటివన్నీ నాటికి నేటికి శిలా శాసనంగా అనుసరించదగిన అత్యుత్తమ సూత్రాలు. ఈ అంశాలను భారతీయ విద్యా విధానంలో అంతర్భాగం గా మారిస్తే భవిష్యత్తును భవ్యంగా తీర్చిదిద్ద గల నాయకులను సృష్టించడం సాధ్యమవుతుంది. చేయాల్సిందల్లా ఈ వ్యవస్థలను నిజమైన అధ్యయన కేంద్రాలుగా మార్చుకోవడమే. “ఇతరుల వద్ద ఉన్న మంచినంతా తెలుసుకో, దాన్ని నీకు అనుకూలంగా అవసరమైన పద్ధతిలో మార్చుకొని సవరించు. అంతేగాని నీ అస్తిత్వాన్ని వదులుకొని వారిలా మారిపోకు” అన్న వివేకానందుడి వ్యాఖ్యలు ఆదర్శం కావాలి. నైపుణ్యాలకు పదును పెట్టుకోవడం అలవాటుగా, జీవన విధానంగా మారితే భారతావని మరోసారి విశ్వ గురువుగా ఆవిష్కరించగలదు. పరిశోధన, సృజనాత్మకతలకు పెద్దపీట వేసి నైతిక పదములో నడిపితే మన విద్యాసంస్థలను ప్రపంచ స్థాయి చేర్చవచ్చు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నేడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము విద్యార్థి లోకానికి జ్ఞానోపదేశం చేసి తరగతి గదుల్లో బావి భారతానికి పునాదులు వేస్తున్న గురువులందరినీ గౌరవించుకోవడంతో పాటు ఆ లక్ష్యసాధనలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణ సృష్టించడం పై అందరూ శ్రద్ధ పెట్టాల్సి ఉంది.