షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు రూ.10,09,511 కోట్ల మాఫీ
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు కీలక విషయాన్ని వెల్లడించారు. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో భారతీయ బ్యాంకులు మొత్తం రూ.10.09 లక్షల కోట్ల విలువైన మొండి పద్దులను మాఫీ చేశాయని తెలిపారు. మాఫీ కారణంగా సంబంధిత బ్యాంకుల బ్యాలెన్స్ షీటు నుంచి నిరర్థక ఆస్తులను తొలగించినట్టు వెల్లడించారు. ఓ రాజ్యసభ ఎంపీ అడిగిన ప్రశ్నకు సీతారామన్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.‘‘ ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డుల నిర్ణయాలకు అనుగుణంగా బ్యాలెన్స్ షీటు క్లియరెన్స్, పన్ను ప్రయోజనాలు, మూలధనానికి వీలుగా రెగ్యులర్ కసరత్తులో భాగంగా బ్యాంకులు ఎన్పీఏలను రద్దు చేశాయి. ఆర్బీఐ నుంచి అందిన సమాచారం ప్రకారం.. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత ఐదేళ్లలో రూ.10,09,511 కోట్ల మొత్తాన్ని మాఫీ చేశాయి’’ అని సీతారామన్ వెల్లడించారు.