27న డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో భాగంగా ఈ నెల 27న హైదరాబాద్ కలెక్టరేట్లో లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్లైన్లో డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్తో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రెండు విడుతల్లో ఎలాంటి విమర్శలకు తావులేకుండా ఎంతో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. 24900 ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు.మొదటి, రెండో విడతలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు మంత్రులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే NIC రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్లైన్ డ్రా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నెల 27 వ తేదీన నిర్వహించే డ్రాలో 3,4 విడతలకు సంబంధించి 21వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న 10,500 మందికి, అక్టోబర్ 5న మరో 10,500 మంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.