డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులకు షాక్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఘన విజయం సాధించింది.. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుండటంతో.. డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను రిలీవ్‌ చేయకూడదని నిర్ణయించింది. అయితే ఇప్పటికే డిప్యుటేషన్‌పై వచ్చిన పలువురు అధికారులు రిలీవ్‌ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. కొందరు తెలంగాణకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఎవరికీ సెలవులు కూడా ఇవ్వకూడదని నిర్ణయించారు.టీటీడీ ఈవో సెలవుపై వెళ్లేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం తిరస్కరించింది.అలాగే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మాతృ సంస్థకు వెళ్తానని దరఖాస్తు చేసుకోగా.. ఏపీ నుంచి తనను రిలీవ్‌ చేయాలని గనులశాఖ ఎండీ వెంకట్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే తనను బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలని సమాచారశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి కోరారు. అలాగే బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి మాతృశాఖకు పంపాలని దరఖాస్తు చేసుకున్నారు. ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ కమిషనర్‌ రాజేశ్వర్‌రెడ్డిలు ఏపీ నుంచి రిలీవ్‌ చేయాలని కోరారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ కూడా తెలంగాణకు వెళ్తానని దరఖాస్తు చేసుకున్నారు.మరోవైపు మరో కీలక పరిణామం జరిగింది.. కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో.. అమరావతిలోని సచివాలయంలోని కీలక డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు , విభాగాధిపతి కార్యాలయాలకు ఆదేశాలు పంపారు. వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు. అంతేకాదు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల, భూముల కేటాయింపు, అధికారుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ విధానంలో ఉన్న రికార్డులను భద్రపరచాలని ఆదేశించారు. మంత్రుల పేషీల్లోని రికార్డులను కూడా భద్రపరచాలని.. ఈ మేరకు జీఏడీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ జారీ ఉత్తర్వులు జారీ చేశారు.అంతేకాదు కీలక ఫైళ్లను ప్రాసెస్‌ చేయొద్దని రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. రెవెన్యూశాఖ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే రెవెన్యూశాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూకేటాయింపులు, అధికారుల బదిలీ ఫైళ్లను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.