ప్రధాని మోడీకి లేఖ రాసిన సోనియా

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఈనెలలో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఎందుకు.. ఇందులో ఏం చర్చిస్తారు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కేవలం సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఆ సమావేశాల ఎజెండాను మాత్రం విడుదల చేయకపోవడంతో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోని ఎజెండాలో ఉండాల్సిన అంశాలను సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. అసలు కేంద్ర ప్రభుత్వ ఎజెండా ఏంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఎజెండాను ప్రకటించక పోవడంపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా ప్రధానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో బయటపెట్టాలని ఆ లేఖలో డిమాండ్‌ చేశారు. దీంతో పాటు ఈ ప్రత్యేక సమావేశాల ఎజెండాలో 9 అంశాలను చేర్చాలని సోనియా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండానే ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల తేదీలను ఖరాలు చేశారన్న సోనియా.. సమావేశాల ఎజెండా ఏంటో ఎవరికీ కనీస అవగాహన కూడా లేదని తెలిపారు. మొత్తం ఐదు రోజుల పాటూ ప్రభుత్వ ఎజెండాకే కేటాయించినట్లు తమకు తెలిసిందని.. అయితే ఆ సమావేశాల్లో కొన్ని అంశాలను చర్చకు తీసుకురావాలని కోరుతున్నట్లు ఆమె తన లేఖలో వెల్లడించారు.అదానీ గ్రూప్‌పై వస్తున్న అక్రమ ఆరోపణలు, మణిపూర్‌ హింసాత్మక ఘటనలు, దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజు రోజుకీ దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హర్యానా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై చర్చ చేపట్టాలని ఈ సందర్భంగా లేఖలో ప్రధాని మోదీని సోనియా గాంధీ కోరారు.ఇక ఈ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే విషయాలను చర్చించేందుకు ఇండియా కూటమిలోని పలు పార్టీలు.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మంగళవారం భేటీ అయ్యారు. సమావేశం తర్వాత మాట్లాడిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌.. మోదీ చాలీసా కోసం మేము పార్లమెంటుకు వెళ్లమని.. సమావేశాల్లో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఆ సమావేశాలు నిర్వహించడం వెనుక కారణాలు ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలు, యూనిఫామ్ సివిల్ కోడ్, ఓబీసీ వర్గీకరణ వంటి అంశాలపై చర్చించడానికే ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.