అధికార, ప్రతిపక్ష సభ్యుల తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లోక్ సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో మంగళవారం బిల్లులకు ఆమోదం తెలిపే సమయంలో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎడతెగకుండా సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పిస్తుండటాన్ని తప్పుబట్టారు. సభా గౌరవానికి అనుగుణంగా సభ్యులు ప్రవర్తించే వరకు తాను సభకు హాజరుకాబోనని హెచ్చరించారు. ఈ హెచ్చరికకు అనుగుణంగానే ఆయన బుధవారం సభాధ్యక్ష స్థానంలో కనిపించలేదు.మణిపూర్ సమస్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పార్లమెంటులో ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు అవిశ్రాంతంగా పట్టుబట్టారు. దీంతో లోక్ సభ గురువారానికి వాయిదా పడింది.లోక్ సభ కార్యకలాపాలను బుధవారం బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకి నిర్వహించారు. సభ్యులు శాంతియుతంగా వ్యవహరించాలని కిరీట్ కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన సభను వాయిదా వేశారు.