తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ హైదరాబాద్ ప్రతినిధి: రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేం రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. మురుగు నీటి శుద్ధీకరణకు ఎస్టీపీలను, పారిశ్రామికవాడల్లోనూ కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పి అంతర్జాతీయ స్థాయిలో కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించేలా చూడాలని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యతనిస్తారని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే పరిశ్రమల మూసివేతకు కూడా వెనుకడుగు వేయరాదని స్పష్టం చేశారు. అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ మురుగునీటిని శుద్ధి చేసేలా నిరంతరం కృషి చేయాలన్నారు. పట్టణాలు, నగరాల్లోంచి వెలువడుతున్న మురుగు నీరు నేరుగా నదులు, కాలువల్లో కలువకుండా రూ. 3,866 కోట్ల వ్యయంతో మురుగునీటిని శుద్ధి చేసేందుకు 31 ఎస్టీపీల నిర్మాణ పనులు ప్రారంభించామని అన్నారు.ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతంలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న 12 స్టోన్ క్రషర్స్ సీజ్ చేసి జరిమానా విధించినట్లు వివరించారు. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇ- వెహికల్ ఫాలసీని ప్రవేశపెట్టడంతో పాటు పర్యావరణహిత వాహనాలను వాడేలా వాహనదారులను ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, పీసీబీ సీఈ రఘు, ఎస్ఈఎస్ డి.ప్రసాద్, ఎన్వీరాన్మెంటల్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు .