రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయండి

- కేంద్రాన్ని కోరిన వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. కొవాగ్జిన్ 8 లక్షలు, కొవిషీల్డ్ 80 వేల డోసులు ఉండగా కోర్బివాక్స్ డోసులు సున్నా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో బూస్టర్ డోసు వేగవంతం చేసేందుకుగాను అవసరమైన వ్యాక్సిన్‌ల‌ను రాష్ట్రానికి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. బూస్టర్ డోసు విషయంలో జాతీయ సగటు 23 శాతం ఉంటే తెలంగాణ సగటు 48 శాతంగా మెరుగైన స్థితిలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ నిత్య పర్యవేక్షణ, అప్రమత్తత చేయడం, ప్రజల్లో అవగాహన పెంచడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.కరోనా పరిస్థితులు రాష్ట్రాల సన్నద్ధతపై కేంద్ర వైద్యరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్‌ మాండవీయ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మంత్రి హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పలు విజ్ఞప్తులు చేశారు.ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్‌.7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరు, ప్రభావం, చికిత్స వంటి అంశాల గురించి రాష్ట్రాలకు తెలియజేయాలని, ఈ అవగాహనతో మరింత అప్రమత్తంగా ఉండడం సాధ్యం అవుతుందన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్స్ లను సమీప ఆస్ప‌త్రుల‌తో అనుసంధానం చేసేలా మ్యాపింగ్ చేసే విధానాన్ని తీసుకురావాలన్నారు.యాన్యువల్ మెంటెనెన్స్ కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన వెంటిలేటర్లు, పీఎస్ఎ ప్లాంట్స్ మరమ్మతులు జరగటం లేదని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తు చర్యలో భాగంగా రాష్ట్రాల్లో అవసరమైన వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఇసిఆర్పి -3 (ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్ -3) రూపొందించే విషయమై ఆలోచించాలన్నారు.ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, డిఎంఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస్ రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.