ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ ప్యానెల్ లో ప్రధానమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని తెలిపింది.ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ ప్యానెల్ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం, న్యాయ వ్యవస్థల ప్రమేయం కూడా ఉన్నట్టుంటుందని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ఈసీ ల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కోర్టు పేర్కొంది. స్వచ్ఛమైన ఎన్నికలను నిర్వహించడమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లక్ష్యమని తెలిపింది. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సరళి స్వచ్ఛంగా లేకపోతే అది వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తుందని అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ () న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించింది.