ముఖ్యమంత్రి జగన్ హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నార్పలలోనే హెలికాఫ్టర్ నిలిచిపోయింది. సాంకేతికలోపం కారణంగా హెలికాఫ్టర్లో పుట్టపర్తికి వెళ్లాల్సిన జగన్.. రోడ్డుమార్గాన బయలుదేరి వెళ్లారు. నార్పల నుంచి బస్సు ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టపర్తికి బయలుదేరారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్ నార్పలలో ‘‘జగనన్న విద్యా దీవెన’’ పథకం నిధులను విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున సాయం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదనేదే తమ ఉద్దేశమన్నారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని, నాడు-నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.