వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: వర్షాకాల సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండటం, సెప్టెంబర్‌లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగస్టులోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని చూస్తోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల రెండోవారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. ఎన్నికలకు ముందు జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశముందని చెబుతున్నారు.మార్చిలో బడ్జెట్ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. నిబంధనల ప్రకారం బడ్జెట్ సమావేశాల తర్వాత మరోసారి సమావేశం కావాల్సి ఉంది. దీంతో ఆగస్టులోనే సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రగతి, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదేళ్లల్లో జరిగిన అభివృద్ధి గురించి చర్చించే అవకాశముంది. అలాగే ఇటీవల రైతులకు ఉచిత కరెంట్ అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. నేతలు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ ప్రణాళికలు రచించనుంది.అటు సంక్షేమ, అభివృద్ది పథకాల వల్ల ప్రజలకు జరిగిన లబ్ధి గురించి చర్చించనున్నారు. ఇప్పటికే ప్రజలను ఆకట్టుకునేందుకు కేసీఆర్ సర్కార్ అనేక కొత్త అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను షురూ చేసింది. బీసీ కుటుంబాలకు రూ.లక్ష సాయంతో పాటు గృహలక్ష్మి పథకం ద్వారా వచ్చే నెల నుంచి సొంత స్థలం ఉండి ఇంటిని నిర్మించుకునేవారికి రూ.3 లక్షల ఆర్ధిక సాయం అందించనుంది. ఇప్పటికే పొడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు మరోవైపు అభివృద్ది పనులను కేసీఆర్ సర్కార్ వేగవంతం చేసింది. వీటిపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి పార్టీకి మైలేజ్ వచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.