రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి

- రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ శివారులో రూ.4.98కోట్ల వ్యవయంతో నిర్మించిన వ్యవసాయ గ్రైన్‌ మార్కెట్‌ యార్డును మంత్రి సోమవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గం నుంచి వహించడంతో గజ్వేల్ రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. రైతులు పండించే పంటకు సరైన మార్కెట్ లేని పరిస్థితుల్లో నేడు మూడు మార్కెట్లు నిర్మించుకున్నామన్నారు.ఉచిత కరెంటు, సాగునీరు అందించడంతో పాటు పెట్టుబడి సాయంగా రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుబంధు ద్వారా రాష్ట్రంలో రూ.65వేలకోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతు చనిపోతే రైతుబీమా ద్వారా రూ.5లక్షల ఇచ్చి రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నామని ఇప్పటివరకు రూ.98వేల మంది రైతుల కుటుంబాలకు రైతుబీమా అందించమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తున్నామన్నారు. ఎండాకాలంలో కూడా హల్దీ వాగు చెక్ డ్యామ్‌లపై నుంచి మత్తడి దూకుతున్నదన్నారు.కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగుల, ఎమ్మెల్యేల, జీతాలు ఆపి రైతులకు రైతుబంధు సాయం ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. వృద్ధులకు ఆసరా పింఛన్లు, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి అందిస్తున్నానమని మంత్రి తెలిపారు. గత 13 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న జీడిపల్లి, కాళ్లకల్, కుచారం, ముప్పిరెడ్డిపల్లి గ్రామ భూ నిర్వాసితులకు 374 ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీలో రూ.22కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీరోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్ రమేశ్‌, ఆర్డీవో శ్యామ్‌ ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.