తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చంద్రయాన్ 3 దిగిన చంద్రుడి దక్షిణ ధృవంపై లూనార్ నైట్ ప్రారంభం కానున్నది. భూ కాలమానం ప్రకారం ఇది 14 రోజులు కొనసాగుతుంది. ఈ సమయంలో చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉష్టోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. అలాగే లూనార్ నైట్ సమయంలో అక్కడ సూర్య కాంతి ఉండదు. దీంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పని చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానల్స్ పని చేయవు. ఈ నేపథ్యంలో ల్యాండర్, రోవర్ను స్లీప్ మోడ్లో ఉంచేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమవుతున్నది. కాగా, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సన్ మిషన్ ఆదిత్య ఎల్1ను ఇస్రో శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా మూన్ మిషన్ చంద్రయాన్ -3 గురించి కూడా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడారు. ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ ఇప్పటికీ పని చేస్తున్నాయని తెలిపారు. అయితే చంద్రుని రాత్రిని తట్టుకునేందుకు ఈ రెండింటినీ స్లీప్ మోడ్లో ఉంచే ప్రక్రియను ఒకటి రెండు రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే రోవర్ ఇప్పటి వరకు చంద్రుడి ఉపరితలంపై సుమారు 100 మీటర్ల దూరం ప్రయాణించిందని వెల్లడించారు.మరోవైపు చంద్రుడి దక్షిణ ధృవంపై ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణించిన మార్గం చిత్రాన్ని ఇస్రో షేర్ చేసింది. అయితే చంద్రుడి దక్షిణ ధృవంపై తిరిగి లూనార్ డే మొదలైన తర్వాత అక్కడ ఉన్న ల్యాండర్, రోవర్ ఏ మేరకు తిరిగి పనిచేస్తాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది.