బిసి కమిషన్ చైర్మన్ ను కలిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను ఈ రోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఒకరోజు పర్యటనకు హైదరాబాద్ కు వచ్చిన హన్సరాజ్ గంగారామ్ ను హరితా ప్లాజా లో కలసి తెలంగాణా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పధకాలను సి.ఎస్ శాంతి కుమారి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీలకు రిజర్వేషన్లు, రిజర్వేషన్ రోస్టర్ అమలుపై బీసీ కమీషన్ చైర్మన్ కు సి.ఎస్, వివరించారు. రాష్ట్రంలో మహిళల బధ్రత కోసం ఏర్పాటు చేసిన “ షీ టీమ్స్” కార్యకలాపాలను కమీషన్ చైర్మన్ కు పోలీసు విభాగం డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం పోలీసు విభాగం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, విభాగంలో పోలీసుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను, అమలౌతున్న విధి విధానాలను ఆయనకు వివరించారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను పార్లమెంట్ సభ్యులు డా. కె. లక్ష్మన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ సభ్యులు టి. ఆచారి, సలహాదారు రాజేష్ కుమార్, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బిసి వెల్ఫేర్ డైరెక్టర్ అలోక్ కుమార్ ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిసారు.