సాగునీటి వనరులతో తెలంగాణలో పల్లెలు సస్యశ్యామలం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:
ప్రభుత్వం కల్పించిన సాగునీటి వనరులతో తెలంగాణలో పల్లెలు సస్యశ్యామలముగా మారుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77 మందికి రూ.21 .09 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘సంపద పెంచాలి. ప్రజలకు పంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష ’అని అన్నారు . 60ఏండ్లలో సాధ్యం కానిది ఎనిమిదేళ్లలో చేసి చూయించారని అన్నారు. ఆసరా ఫించన్ ను రూ.200 నుంచి రూ.2016, దివ్యాంగులకు రూ.500 ఫించన్ను రూ.3016 చేశారని అన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116 సాయం, రైతుబంధుతో ఎకరాకు ఏడాదికి రూ.10 వేల సాయం అందిస్తున్నారని వెల్లడించారు.రైతు ఏ కారణం చేత మరణించినా రైతుబీమా కింద పది రోజుల లోపు ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నారని వివరించారు.సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలుస్తుందని వెల్లడించారు. మునుగోడు ఎన్నికలలో అత్యధిక మెజారిటీ అందించినందుకు మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సన్మానించారు.