మురాకో లో మరణ మృదంగం

.. 2000 దాటిన మృతుల సంఖ్య

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం (Morocco earthquake) ఆ దేశానికి పెను విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శిథిలాలను వెలికి తీసేకొద్దీ మృతదేహాలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకూ భూకంప మృతుల సంఖ్య 2,012కు చేరింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉండగా.. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన పర్యాటకుడ్ని గుర్తించారు. మరో 2,059 గాయపడగా.. వీరిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి 11.11 గంటల సమయంలో సంభవించిన ఈ భూకంపం మొరాకోలో ప్రముఖ పర్యాటక ప్రాంతం మారకేష్‌ దాని చుట్టుపక్కల ఐదు ప్రావిన్సులను భయకంపితులను చేసింది.హై అట్లాస్‌ పర్వతాల వద్ద ప్రాణనష్టం ఎక్కువగా సంభవించే అకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ మసీదు కటూబియాకు తీవ్రనష్టం వాటిల్లింది. ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు కుడ్యం కూడా బీటలు వారింది. మొరాకో ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ మేరకు కింగ్‌ మహమ్మద్‌-6 నిర్ణయం తీసుకొన్నారు. బాధితులకు ఆహారం, పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరుసగా రెండో రోజు కూడా ప్రజలు అర్ధరాత్రి వీధుల్లోనే గడిపారు. శిథిలాల నుంచి వీలైనన్ని నిత్యావసరాలను ప్రజలు తమతోపాటు తెచ్చుకొన్నారు.అయితే, భూకంప నష్టాన్ని పూడ్చటానికి చాలా ఏళ్లు పడుతుందని రెడ్ క్రాస్ సంస్థ హెచ్చరించింది. ఎటుచూసిన శిథిలాలు.. శవాలు, తెగపడిన అవయవాలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మరో వైపు మారకేష్‌ విమానాశ్రయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఆ దేశాన్ని వీడి వెళ్లే పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడ పడిగాపులు కాస్తున్నారు. వారంతా నేలపైనే సేదదీరుతున్నారు. విమాన ప్రయాణాల్లో ఎటువంటి మార్పులు లేవు. మరోవైపు ప్రజలకు సాయం చేసేందుకు మొరాకో సాకర్‌ జట్టు ముందుకొచ్చింది. ఈ జట్టు సభ్యులు క్షతగాత్రుల కోసం రక్తదానం చేశారు.భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న పర్వత ప్రాంత గ్రామం టఫెఘాగ్టేలో.. ఒక్క భవనం కూడా మిగల్లేదు. ఈ ప్రాంతంలోని బెర్బెర్ నివాసులు ఉపయోగించే సాంప్రదాయక మట్టి ఇటుకలు భూకంపాన్ని తట్టుకోలేపోయాయి. శనివారం మధ్యాహ్నం నుంచి శిధిలాల్లో చిక్కుకున్నవారిని వెలికి తీస్తున్నారు. అయితే వీరిలో చాలా మంది అప్పటికే చనిపోయారు. ఆ ఒక్క గ్రామంలోనే 70 మందికి అంత్యక్రియలు నిర్రవహించారు.భూకంపంలో నా తల్లి, ముగ్గురు మనవళ్లను పోగొట్టుకున్నానని, ఇప్పటికీ వారు శిథిలాల కింద ఉన్నారని గ్రామస్థుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 120 ఏళ్ల తర్వాత మొరాకోలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా నిపుణులు చెబుతున్నారు.‘విధ్వంసకరమైన భూకంపాలు అరుదుగా సంభవించే ప్రాంతాల్లో భవనాలను అత్యంత పటిష్టంగా నిర్మించరు… అందుకే చాలా నిర్మాణాలు కూలిపోయి.. ఫలితంగా అధిక ప్రాణనష్టం సంభవించింది’ అని బ్రిటన్ యూనివర్శిటీ కాలేజ్ లండన్‌ ఎమెరిటస్ ప్రొఫెసర్ బిల్ మెక్‌గ్యురే అన్నారు.

Leave A Reply

Your email address will not be published.