భూమిని చదును చేస్తున్న గిరిజనులను అడ్డుకున్నఅటవీశాఖ అధికారులు

-  తండా వాసులు చదును చేస్తున్న ట్రాక్టర్లను తీసుకెళ్ళిన అటవీశాఖ అధికారులు -  అటవీ అధికారులను నిర్బంధించిన  తండా వాసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాచారెడ్డి మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాత ఎల్లంపేట, దుర్గమ్మ గుడి తండా సమీపంలో అటవి భూమిని చదును చేస్తున్న గిరిజనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో తండావాసులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తండా వాసులు చదును చేస్తున్న ట్రాక్టర్లను తీసుకుని పారిపోయారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అటవీ అధికారులను తండా వాసులు నిర్బంధించారు. అక్కడ డ్యూటీలో ఉన్న బీట్ ఆఫీసర్ ప్రశాంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీట్ ఆఫీసర్ ఉన్నతాధికారులకు అక్కడ పరిస్థితిని వివరించారు. దీంతో స్థానిక సెక్షన్ ఆఫీసర్ పవన్ తన సిబ్బందితో సంఘటన ప్రదేశానికి చేరుకుని తండా వాసులను చెల్లాచెదురు చేశారు. విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ రమేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కాగా మాచారెడ్డి మండలంలో గత కొంతకాలంగా అటవీ భూములను ఆక్రమిస్తూ ఆ పరిసర ప్రాంత రైతులు, గిరిజనులు సాగు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పాత ఎల్లంపేట గ్రామ పరిధిలో భూములను పరిశీలించేందుకు అటవిశాఖ సిబ్బంది వెళ్లారు. చదును చేస్తున్న గిరిజనులను ప్రశ్నించారు. ఈ క్రమంలో గిరిజనులు-అటవీ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా భూములను సాగు చేస్తున్నారని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు. దీంతో గిరిజనలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సిబ్బందిపై తిరగబడి.. నిర్బంధించారు. దీంతో సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.