సెల్ఫీ తీసుకుంటూ నీటిలో జారిపడ్డ బాలిక

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన కూతురుని కాపాడబోయి తండ్రి మృతిచెందాడు. కూతురు సెల్ఫీ తీసుకుంటా నీటిలో జారిపడగా.. ఆమెను రక్షించే క్రమంలో తనువు చాలించాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్ (47) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం గుడికి వెళ్లాడు. బక్రీద్ సెలవు దినం కావటంతో గుడికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో భార్య, కూతురు సాయినిత్య, కుమారుడు విక్రాంత్‌తో కలిసి ఎల్ఏండీ రిజర్వాయర్ వద్దకు సరదాగా గడిపేందుకు వెళ్లారు.రిజర్వాయర్ వద్ద సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు జారీ నీటిలో పడిపోయింది. గమనించిన తండ్రి విజయ్ కుమార్, అన్నయ్య విక్రాంత్ నీటిలో దూకారు. ముగ్గురు నీటిలో మునిగిపోవటం చూసి ఒడ్డునే ఉన్న భార్య గట్టిగా కేకలు వేసింది. సమీపంలోనే ఉన్న శంకర్ అనే మత్స్యకారుడు.. సాహసం చేసి నీటిలో దూకాడు. సాయినిత్య, విక్రాంత్‌లను కాపాడి ఒడ్డుకు చేర్చగా.. విజయ్ కుమార్ అప్పటికే నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకొని మృతదేహాం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.స్థానిక మత్స్యకారుల సాయంతో విజయ్ డెడ్ బాడీని బయటకు తీశారు. కళ్లెదుటే తండ్రి చనిపోవటంతో పిల్లలిద్దరూ గుండెలవిసేలా రోధించారు. అది చూసిన స్థానికులు కంటతడి పెట్టారు.

Leave A Reply

Your email address will not be published.