రెండు సంవత్సరాల తరువాత అసెంబ్లీలో అడుగుపెట్టనున్న గవర్నర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 3న ప్రారంభం కానున్నాయి. గత అసెంబ్లీలకు కొనసాగింపుగానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నా… ఈసారి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇటీవల బీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా వెళ్లి బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు. దీంతో రెండు సంవత్సరాల తరువాత గవర్నర్ తమిళ సై అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.అయితే గతంలో గవర్నర్ ప్రసంగం సాదాసీదాగానే ఉండేది. ప్రభుత్వం చేసిన.. చేయబోయే కార్యక్రమ వివరాలను చదివేవారు. కానీ ఇటీవల తెలంగాణలో రాజ్ భవన్ ప్రగతి భవన్ ల మధ్య ఏర్పడిన వివాదాలు కోర్టుకెక్కాయి. ఆ తరువాత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుంది..ప్రభుత్వం ఇచ్చిన పత్రాలే చదువుతారా..లేక అందులో సవరింపులు కోరుతారా..అనేది చర్చనీయాంశంగా మారింది.గవర్నర్ తమిళ సై సీఎం కేసీఆర్ మధ్య ఐదారు నెలలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. దీంతో కేసీఆర్ గవర్నర్ లేకుండానే కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. గత బడ్జెట్ సమావేశాలు గవర్నర్ స్పీచ్ లేకుండానే పూర్తి చేశారు. ఈసారి కూడా  అలాగే కొనసాగించాలని నిర్ణయించారు. కానీ కొన్ని బిల్లులతో పాటు బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం బడ్జెట్ కు అనుమతించాలని కోర్టుమెట్లెక్కింది.  ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తుల సమక్షంలో చర్చలు జరిగాయి. ఆ తరువాత ప్రభుత్వం వేసిన పిటిషన్ తో పాటు గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.అయితే   గవర్నర్ ప్రసంగం కాపీని ప్రభుత్వం రూపొందిస్తోంది.  సాధారణంగా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన పథకాల గురించి వివరిస్తారు. అలాగే చేపట్టబోయే పథకాల గురించి చెబుతారు. వీటి సారాంశాన్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చుతారు. అయితే గవర్నర్ ప్రసంగంలో కేంద్రం పై విమర్శలను కూడా  ఉంటాయని  కొందరు అనుకుంటున్నారు. కానీ అలాంటి వ్యాఖ్యలు గవర్నర్ చదువుతారా..లేదా అలాంటి విషయాలు తనకు కనిపిస్తే వాటిని చదవకుండా దాటవేస్తారా..అనేది  తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా తెలంగాణ బడ్జెట్ 2023-24 కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మూడో తేదీన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తరువాత రెండు రోజుల విరామం తీసుకొని 6న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇన్ని రోజులు ఏర్పడిన వివాదాల కారణంగా గవర్నర్  బడ్జెట్ కు ఆమోదం తెలపలేదు. ఇప్పుడు వివాదం సమసినందున ఆమోదించారు. ఈ బడ్జెట్ సమావేశాలో మొత్తం రోజులు సాగనున్నాయి. ఈనెల 3న ప్రారంభమై 14న ముగియనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.