సీఎంకు ఎదురుదెబ్బ, వైస్ ఛాన్సలర్ నియామకాన్ని కొట్టేసిన హైకోర్టు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: యూనివర్శిటీల పనితీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు, గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కు మధ్య తలెత్తిన వివాదం మలుపులు తిరుగుతోంది. స్టేట్ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు సోమవారంనాడు కొట్టివేసింది. దీంతో పినరయి విజయన్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగలినట్టయింది.కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ రిజి జాన్ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ నియమాకం చట్టవిరుద్ధమని, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టు స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కొత్త వైస్ ఛాన్సలర్ నియామకం చేపట్టాల్సిందిగా ఛాన్సలర్ ఆఫ్ యూనివర్శిటీస్ను ఆదేశించింది. ప్రస్తుతం ఛాన్సలర్ ఆప్ యూనివర్శిటీస్గా గవర్నర్ ఖాన్ ఉన్నారు. గవర్నర్ గత నెలలో తొమ్మిది యూనివర్శిటీల వైస్ఛాన్సలర్ల నియామకాలు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వారిని తమ పదవి నుంచి దిగిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో కేరళ యూనవిర్శిటీల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య వివాదం మొదలైంది. ఇందుకు ప్రతిగా, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా గవర్నర్ను తొలగించి ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని ప్రతిపాదిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించి, దానిపై సంతకం చేయడానికి గవర్నర్కు పంపింది. ఇది తన అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ అని, తనకు తానుగా తీర్పు చెప్పలేనందున రాష్ట్రపతికి పంపిస్తానని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ మీడియాకు తెలిపారు.