భార్యతో గొడవపడి ఇంటికి నిప్పు అంటించిన భర్త
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కలహాలు లేని కాపురాలు ఉండవని పెద్దలు అంటుంటారు. భార్యభర్తలు గొడవపడినా.. కాసేపటికే కలిసిపోతారు. ఇక ఎంత పెద్ద సమస్య అయినా.. ఓ పది నిమిషాలు కుర్చుంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ నేటి సమాజంలో విచక్షణకోల్పోతున్నారు. చిన్న కారణాలకే గొడవలు పడుతున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అటువంటి ఘటనే చోటు చేసుకుంది.భార్యభర్తల మధ్య గొడవ ఇంటిని తగులుబెట్టేవరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం పద్మానగర్ గ్రామానికి చెందిన బాల పోశయ్య, రాజేశ్వరి దంపతులు. కొన్నేళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా.. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరగుతున్నాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాల పోశయ్య భార్యపై, ఇంటిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ ప్రమాదంలో భార్య, భర్తలకు స్వల్ప గాయాలు కాగా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రస్తుతం వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.