హుజూరాబాద్‌లో చేసిన తప్పిదమే మునుగోడులో..? అదే ఫలితం రానుందా.?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు బై పోల్ లో గెలిచి వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగులేదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకనుగుణంగా పావులు కదుపుతూ.. ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని పార్టీల నేతలు మకాం వేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు.

ఈ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక్కడ విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను ఉప ఎన్నిక రంగలోకి దింపారు. నియోజకవర్గంలో మొత్తం 86 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిని 86 క్లస్టర్లుగా విభజించారు. ఒక ఎంపీటీసీ స్థానానికి ఓ ఎమ్మెల్యే, లేదా మంత్రి ఇంఛార్జ్‌గా ఉంటారన్న మాట. అంతెందుకు గులాబీ బాస్ కేసీఆర్‌ కూడా నియోజకవర్గంలోని లెంకలపల్లి గ్రామానికి ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన గ్రామాల పరిధిలో విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న అసలు సమస్య ఇక్కడే వచ్చినట్లు తెలుస్తోంది.
గ్రామాలకు ఇంఛార్జ్‌లుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమతోపాటు తమ అనుచరులను భారీగా నియోజవర్గానికి తరలించారు. వారు గ్రామాల్లోని స్థానిక నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బూత్‌లుగా విడగొట్టి ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వచ్చిన కీలక నేతలు మళ్లీ ఇంఛార్జ్‌లుగా వ్యవహరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు పంపిణీ జరగనుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆ డబ్బు పంపిణీ కూడా మంత్రులు, ఎమ్మెల్యే వెంట వచ్చిన కీలక నేతల ద్వారానే జరగనుందని ప్రచారం. ఇది స్థానిక నేతలకు మింగుడు పడటం లేదు. తాము ప్రచారానికే పరిమితమవుతున్నామే తప్ప.., తగిన ‘ప్రాధాన్యం’ దక్కటం లేదని సొంత పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బయటి వారికే ప్రాధాన్యం ఇస్తూ తమను ప్రచార బొమ్మలుగానే చూస్తున్నారని స్థానిక నేతలు మనోవేదనకు గురవుతున్నట్లు సమాచారం. దీంతో టీఆర్‌ఎస్ పార్టీలో లోకల్, నాన్ లోకల్ వార్ మెుదలై.. పరస్పర సహకారం కొరవడుతుందన్న టాక్ వినిపిస్తోంది. పోలింగ్ తేదీ సమీస్తున్న సమయంలో పార్టీలో చీలికలు వస్తే గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ బైపోల్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని.., అందువల్లే ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందని టీఆర్‌ఎస్ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇలాగే పోలింగ్ వరకు కొనసాగితే హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులోనూ రిపీట్ అయ్యే అవకాశం ఉందని వారు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి చెక్ పెట్టి పార్టీ కేడర్ మధ్య సమన్వయం కుదిర్చే పనిలో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నిమగ్నమైనట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.