నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్
- కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై ఆ జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాం అని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పలు విషయాలను ఆయన వెల్లడించారు.ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమే అని స్పష్టం చేశారు. ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరుగుతాయన్నారు. రైతుల అభ్యర్థనలను నమోదు చేసుకుంటామని తెలిపారు. రైతుల అభ్యర్థనలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎవరైనా సరే సూచనలు ఇవ్వొచ్చని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. 60 రోజుల్లో సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయి. రైతులకు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. జనవరి 11న సాయంత్రం 5 గంటల వరకు అభిప్రాయాలు చెప్పొచ్చు అని కామారెడ్డి కలెక్టర్ తెలిపారు.
భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే..
భూములు పోతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కలెక్టర్. భూములు పోతాయని ఎందుకు అపోహ పడుతున్నారో తెలియడం లేదన్నారు. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే అని స్పష్టం చేశారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. పట్టణం ఎలా విస్తరిస్తుందో.. దాని ప్రకారమే మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ముసాయిదా ఫైనల్ కావాడానికి చాలా దశలు ఉన్నాయి. ఇది ఇంకా మొదటి దశలోనే ఉంది. రైతుల భూములు ఎక్కడికి పోవు. మీ భూమి మీ పేరు మీదనే ఉంటుందన్నారు. మా దృష్టికి వస్తున్న అభ్యర్థనలను పరిశీలించి, నివృత్తి చేస్తున్నామని తెలిపారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూముల సేకరణ కాదు అని కలెక్టర్ జితేశ్ పాటిల్ స్పష్టం చేశారు.