ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టులోకొనసాగుతున్న విచారణ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటీషన్లపై వాదనలు వింటోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అంశంపై రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ కొన్ని పిటీషన్లు దాఖలు అయ్యాయి. సీజేఐ చంద్రచూడ్తో పాటు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్లు ఆ ధర్మాసనంలో ఉన్నారు.పిటీషనర్ల తరపున కపిల్ సిబల్ వాదించారు. ఇది చరిత్రాత్మక విచారణ అవుతుందన్నారు. 2019 ఆగస్టు 6వ తేదీన జరిగిన చారిత్రక తప్పును కోర్టు విశ్లేషించనున్నట్లు తెలిపారు. ఈ కేసులో వాదనలు వినేందుకు కోర్టుకు అయిదేళ్లు పట్టిందని, అయిదేళ్ల నుంచి జమ్మూకశ్మీర్లో ప్రభుత్వమే లేదన్నారు. ఈ కేసులో తన వాదనలు వినిపించేందుకు సిబల్కు 10 గంటల సమయాన్ని కేటాయించారు. భారత్లో జమ్మూకశ్మీర్ అంతర్ భాగమని, ఆ రాష్ట్ర చరిత్రను సిబల్ తన వాదనల్లో వినిపించారు.ఈ కేసులో విచారణ చాలా రోజుల పాటు సాగే అవకాశాలు ఉన్నాయి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసిన అంశంపై ప్రస్తుతం కోర్టులో 20 పిటీషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఆర్టికల్ 370పై రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాలను రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని పిటీషనర్లు కోర్టులో కోరారు. ఈ కేసులో పిటీషన్ వేసిన వారిలో అడ్వకేట్ ఎంఎల్ శర్మ, కశ్మీర్ లాయర్ షకీర్ షబీర్, ఎంపీ అక్బర్ లోన్, జస్టిస్ మసూదీ, రాధా కుమార్, మాజీ జనరల్ అశోక్ మెహతా, మాజీ ఐఏఎస్ తయబ్జీ, అమితాబ్ పాండే, గోపాల్ పిళ్లై ఉన్నారు.ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చింది. అయితే ఆ ఆర్టికల్ను 2019 రద్దు చేశారు.