తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం గారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరికీ హృదయ పూర్వక 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కులమతాలకు అతీతంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలందరూ కలిసి జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం. భారతదేశ ప్రయాణానికి దిక్చూచి అయిన రాజ్యాంగాన్ని బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి నాయకత్వంలోని కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు శ్రమించి రూపొందించింది అన్నారు.
రాజ్యాంగం పవిత్రమైనదని, శాంతియుతంగా తెచ్చిన స్వాతంత్ర్య ఫలాలను పరిపాలనలో అమలు చేయాల్సిన
బాధ్యతలు, విధులను తెలిపే రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు. రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్కరూ అనుభవించాలి. దేశ సంపద ఏ ఒక్కరి సొత్తు కాదు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే పరిపాలన నిస్వార్థంగా, చిత్తశుద్ధితో జరగాలి అని ఆకాంక్షించారు.
రాజ్యాంగ స్పూర్తితో, ఫెడరల్ స్పూర్తితో ప్రభుత్వాలు పనిచేసినప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు సమంగా అందుతాయి. ఈమధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొంత బాధ కలుగుతుంది. పేదలకు ధనికుల మద్య అంతరం భారీగా పెరుగుతుంది.1 శాతం ఉన్న ధనికుల చేతిలో 40 శాతం సంంపద ఉన్నదని సర్వేలు తెలుపుతున్నాయి. ఈ అంతరం తగ్గాలి. అందరూ ఆనందంగా ఉండడమే నిజమైన రాజ్యాంగం అమలు అయినట్లు అన్నారు. కొందరి కోసం పనిచేయడం రాజ్యాంగ విరుద్ధం. స్పీకర్ అయినా- ప్రధాని అయినా రాజ్యాంగం పరిధిలోనే పదవులు వచ్చాయి నావారు నీవాళ్ళు అనే భేదం ఉండవద్దు. కేసీఆర్ నాయకత్వం లో సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని కంటి వెలుగు కార్యక్రమాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకటించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పోటీ పడి పనిచేయాలి తప్ప విమర్శలు కాదు. భిన్న సంస్కృతులతో సమ్మేళితం అయి భిన్నత్వంలో ఏకత్వం కూడిన దేశం మనది అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అధికారులు పాల్గొన్నారు.