ఉగ్రరూపం దాల్చిన యమునా నది
- ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వరద నీరు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: యమునా నది ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఉదయం 7 గంటలకు వరద ఉద్ధృతి వల్ల ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి 500 మీటర్ల దూరంలో వరద నీరు ప్రవహిస్తోంది. హర్యానాలోని ఓ బ్యారేజి నుంచి నీటిని యమునా నదిలోకి విడుదల చేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.గురువారం ఉదయం 7 గంటలకు యమునా నదిలో నీటి మట్టం 208.46 మీటర్లకు చేరింది. ఇది ప్రమాద స్థాయి కన్నా మూడు మీటర్లు ఎక్కువ. హర్యానాలోని హత్నికుండ్ జలాశయం నుంచి నీటిని యమునా నదిలోకి విడుదల చేస్తుండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ బ్యారేజి నుంచి నీటిని విడుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కేంద్రం స్పందిస్తూ, బ్యారేజ్లో మితిమీరి ఉన్న నీటిని విడుదల చేయవలసి ఉంటుందని చెప్పింది. భారీ వర్షాల వల్ల హిమాచల్ ప్రదేశ్లో విపరీతమైన విధ్వంసం జరిగింది. అక్కడి నుంచి నీరు ఈ బ్యారేజ్లోకి వస్తోంది.
ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఏరియాలో రింగ్ రోడ్డు వరదలో చిక్కుకుంది. మజ్ను కా తిల-కశ్మీరీ గేట్ ఐఎస్బీటీ మార్గాన్ని మూసివేశారు. ఇక్కడి నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ శాసన సభ ఉన్నాయి. హర్యానాలోని బ్యారేజ్ నుంచి నీటి ప్రవాహం గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తగ్గే అవకాశం ఉందని కేంద్ర జల కమిషన్ తెలిపింది. పాత ఢిల్లీ వరద ప్రభావిత ప్రాంతం కావడంతో నిగంబోధ్ ఘాట్ శ్మశాన వాటికను ఉపయోగించవద్దని అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి.ఢిల్లీ నగరంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు లేవు. అయితే యమునా నదిలోకి హర్యానా నుంచి నీటిని విడుదల చేస్తుండటం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యమునా నదిలో నీరు ఆల్ టైమ్ హైలో ఉంది.వజీరాబాద్లోని సిగ్నేచర్ బ్రిడ్జ్ సమీపంలో, గర్హి మండు గ్రామం వరద నీటిలో మునిగిపోయింది. ఐటీఓ, కశ్మీరీ గేట్, జీటీ కర్నాల్ రోడ్, బోట్ క్లబ్, మోనాస్టరీ మార్కెట్, నీలి ఛత్రి టెంపుల్, యమునా బజార్, నీమ్ కరోలీ గోశాల, విశ్వకర్మ కాలనీ, న్యూ ఉస్మాన్పూర్ తదితర ప్రాంతాల్లో నీరు చేరింది.