ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో భాగంగా హైదరాబాద్ చేరుకున్న సిట్ బృందం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: హైదరాబాద్ లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కు ప్రలోభాల కేసులో కేరళకు వెళ్లిన సిట్ బృందం శుక్రవారంనాడు హైద్రాబాద్ కు చేరుకుంది.

దాదాపుగా ఐదు రోజలపాటు సిట్ బృందం కేరళలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జగ్గుస్వామి అనే డాక్టర్ ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్టుగా సిట్ బృందం గుర్తించింది. సిట్ బృందం విచారణకు వస్తుందనే విషయాన్ని గుర్తించిన జగ్గుస్వామి పారిపోయాడు. జగ్గుస్వామి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి నేతృత్వంలో సిట్ బృందం కేరళలో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో కూడా సిట్ బృందం సోదాలు చేసిన విషయం తెలిసిందే.

కేరళకు చెందిన తుషార్ కు రామచంద్రభారతికి జగ్గుస్వామి మధ్యవర్తిగా వ్యవహరించినట్టుగా సిట్ బృందం గుర్తించిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణలో భాగంగా సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. తుషార్ , జగ్గుస్వామి, కరీంనగర్ కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ కు సిట్ బృందం నోటీసులు జారీ చేసింది.ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసులు పంపింది సిట్ బృందం.. రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ ముగ్గురు ప్రలోభాలకు గురి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు జైల్లో ఉన్నారు.ఈ కేసును హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందం విచారిస్తుంది.తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల వెనుక బీజేపీ ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.ఇదే డిమాండ్ తో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ విషయమై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు అంగీకరించలేదు. సిట్ దర్యాప్తునకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

Leave A Reply

Your email address will not be published.