ధూప దీపం అలవెన్స్ లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ధూపదీప నైవేద్యం అలవెన్స్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్చకులకు ప్రతి నెల ఇచ్చే రూ.6వేల అలవెన్స్ను రూ.10 వేలకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తాజాగా దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రూ. 10వేలలో అర్చకుల గౌరవ వేతనం కింద రూ.6వేలు, ఆలయంలో పూజలు, ఇతర నిర్వహణకు రూ.4వేలు కేటాయించింది.ఆలయాల్లో నిరంతరం పూజలు, ఇతర కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకాన్ని తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ 2009లో ధూప, దీప నైవేద్యం పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత అర్చకులకు నెలకు రూ. 2500 వేతనంగా నిర్ణయించింది. కానీ, ఈ వేతనాలు అర్చకులకు, ఆలయాల నిర్వహణకు ఏమాత్రం సరిపోవని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2015 జూన్ 2 నుంచి ధూపదీప నైవేద్యాల కింద అందజేస్తున్న వేతనాలు రూ. 6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అటు ఆలయాలకు.. ఇటు అర్చకులకు ఎంతో మేలు చేకూరింది. ఇప్పుడు పెరిగిన ఖర్చులతో ఇది కూడా సరిపోదని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే అలవెన్స్లను రూ.10వేలకు పెంచింది.