పద్మనాభ స్వామి కొండపై వెలుగు చూసిన రాతియుగపు ఆనవాళ్లు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మణికొండ మునిసిపల్ కౌన్సిల్ పరిధిలోని ల్యాంకోహిల్స్‌ సమీపంలో ఖాజాగూడ మెహర్‌బాబా అనంత పద్మనాభస్వామి కొండపై రాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీ.ఈ.వో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు, నగరంలోని అపురూప శిలాకృతు (రాక్‌ఫార్మేషన్‌) ల వద్ద ఆది మానవుని అడుగుజాడల అన్వేషణలో భాగంగా ఆయన ప్లీచ్‌ ఇండియా బృందంతో కలసి గురువారం ల్యాంకోహిల్స్‌ పరిసరాల్లోని మెహర్‌ బాబా గుహకు ఎగువన 50 మీటర్ల దూరంలో నాలుగు చోట్ల 30 సెం.మీ. 20 సెం.మీ మధ్య పొడవు, 2 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. నుంచి 5 సెం.మీ. లోతుగల రాతి గాళ్లున్నాయని వాటి ఆకారం అరగదీసినతీరును బట్టి ఇవి ఖచ్చితంగా కొత్త రాతియుగపు మానవులు తమ రాతి గొడ్డళ్లను పదును పెట్టుకోగా ఏర్పడిన రాతి గ్రూప్స్‌ గా గుర్తించినట్లు, ఇప్పటికి పూర్వం 6000 నుండి 4000 సం॥ల మధ్య కాలానికి చెందినవని శివనాగిరెడ్డి చెప్పడం జరిగినది మరియు అనంత పద్మనాభస్వామి ఆలయ దారికి అటూ ఇటూ ఉన్న సహజ సిద్ధమైన నాగపడిగె లాంటి రాతి బండల కింద ఆనాటి మానవులు తాత్కాలికంగా నివసించేవారని, ఆ సందర్భంగా రాతి పనిముట్లకు పదును పెట్టుకొనేవారని ఆయన తెలియజేస్తున్నారు, గతంలో కూడా సమీపం లోని నార్సింగి, కోకాపేట, జూబ్లీహిల్స్‌, బిఎన్‌ఆర్‌ హిల్స్‌లో కొత్త రాతి యుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని, ఈ నేపథ్యంలో ఖాజాగూడ కొత్త రాతి యుగపు ఆనవాళ్లు హైదరాబాదు నగర పురా చరిత్రకు ఆధారాలవుతాయని, వీటిని కాపాడుకోవాలని ఆలయ యాజమాన్యానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్లీచ్‌ ఇండియా ఆర్కియాలజిస్టులు మైత్రేయి, దుర్గ, నయన్‌, సాక్షి, కిరణ్‌, జితేంద్ర పాల్గొన్నారని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.