నిరుద్యోగులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నా దొరకు నిద్ర మత్తు వదలడం లేదు

- టీవైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గ్రూప్–2 పరీక్ష వాయిదాకు 5 లక్షల మంది అభ్యర్థులు పట్టుబడుతున్నా.. దొరకు నిద్ర మత్తు వదలడం లేదని టీవైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. శనివారం నాడు షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నా సీఎం కేసీఆర్‌ కంటికి కనిపించడం లేదు.పరీక్షలు మరో 3 నెలలు వాయిదా వేయాలని ఎవరెంత మొత్తుకున్నా పట్టింపు లేనితనం కేసీఆర్ నియంత పోకడకు మరోసారి అద్దం పడుతుంది. తొమ్మిదేళ్లుగా ఉద్యోగాల భర్తీ పక్కన పెట్టి నిరుద్యోగులను ఉరికంభం ఎక్కించారు.ఇంటికో కొలువు ఇస్తానంటే నమ్మినందుకు తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చారు.కొలువులు ఇయ్యాలని రోడ్డు మీదికి వచ్చిన లక్షలాది మందిపై లాఠీలు ఝులిపించారు. ప్రశ్నించిన నిరుద్యోగులపై అక్రమ కేసులు బనాయించారు.అంగట్లో ప్రశ్నాపత్రాలు అమ్ముకొని నిరుద్యోగుల కడుపుల్లో మట్టి కొట్టారు.టీఎస్పీఎస్సీ బోర్డును భ్రష్టు పట్టించింది చాలదన్నట్లుఎన్నికల్లో లబ్ది పొందడం కోసం హడావుడిగా బలవంతపు పరీక్షలు పెడుతున్నారు.నిరుద్యోగుల ఆశయాలను శాశ్వతంగా సమాధి చేస్తున్నారు. ఇకనైనా మీ దుర్మార్గపు ఆలోచన మానుకొని, నిరుద్యోగులు కోరుతున్నట్లు గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలి.నిరుద్యోగులతో చర్చించి క్రమపద్ధతి ప్రకారం పరీక్షలు నిర్వహించాలి.లేదంటే మీ బంధిపోట్ల రాష్ట్ర సమితిని నిరుద్యోగులే బొంద పెడతారు. ప్రగతిభవన్ గడీలను బద్దలు కొట్టి రోడ్డుపైకి ఈడుస్తారు’’ అని బీఆర్ఎస్ ప్రబుత్వంపై షర్మిలారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.