తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. పల్లెలుఒకప్పుడు తాగునీటి కోసం తండ్లాడేవని, మిషన్ భగీరథతో నేడు ఆ సమస్య పూర్తిగా సమసి పోయిందన్నారు. పల్లెనిద్రలో భాగంగా వనపర్తి జిల్లా నాగసానిపల్లిలో గురువారం ఉదయం ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి రాకతో గ్రామాల నుంచి వలసలు తగ్గాయన్నారు. ఒకనాడు వలసెల్లిన కుటుంబాలు వెనక్కి వచ్చాయని చెప్పారు. బీడుభూములు సస్యశ్యామలమయ్యాయని, పంట రాశులతో పల్లెలు కళకళలాడుతున్నాయని తెలిపారు.మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు బాగయ్యాయని, పల్లెప్రగతితో గ్రామాలు పరిశుభ్రమయ్యాయని చెప్పారు. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం నిర్మాణంతో పల్లెలకు కొత్త శోభ వచ్చిందని వెల్లడించారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నీళ్ల ట్యాంక్ కేటాయింపుతో చెత్త సేకరణ, చెట్ల పెంపకానికి ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపు ఫలితంగానే ఇవన్నీ సాధ్యమయ్యాయని తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలుకావడం లేదని స్పష్టం చేశారు.