టాయిలెట్ కుండీపైన కంటే మంచినీళ్ల బాటిల్పైనే బ్యాక్టీరియా ఎక్కువట
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఆయాచోట్ల నీళ్లు ఉండకపోతేనే, లేదంటే స్వచ్ఛంగా ఉండవనో ఇంటి నుంచి మంచినీళ్లు తీసుకెళ్తుంటారు. అందుకోసం వాటర్ బాటిళ్లను వినియోగిస్తుంటారు. మరుసటి రోజు అదే బాటిల్ను శుభ్రం చేసుకుని పునర్వినియోగిస్తుంటారు. అయితే, ఇలా పునర్వినియోగించే మంచినీళ్ల బాటిళ్లపై మిలియన్ల కొద్ది బ్యాక్టీరియా ఉంటుందట. ఎంతలా అంటే టాయిలెట్ కుండీలపై ఉండే బ్యాక్టీరియా కంటే 40 వేల రెట్లు అదనంగా మంచినీళ్ల బాటిళ్లపై ఉంటుందట.అమెరికాకు చెందిన ‘వాటర్ ఫిల్టర్ గురు.కామ్’ వివిధ రకాల బాటిల్ మూతల నుంచి నమూనాలను సేకరించి, పరిశోధించింది. ఈ పరిశోధనల్లో మంచి నీళ్ల బాటిళ్లపై గ్రామ్-నెగెటివ్ రాడ్స్ బాసిల్లస్ వంటి రెండు రకాల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియావల్ల కలిగే ఇన్ఫెక్షన్తో యాంటీ బయోటిక్స్ పనిచేయకుండా పోతాయని, బాసిల్లస్ రకానికి చెందిన బ్యాక్టీరియా జీర్ణాశయ సంబంధిత సమస్యలకు కారణమవుతుందని పరిశోధకులు తెలిపారు.ఇక పునర్వినియోగ మంచినీళ్ల బాటిళ్ల శుభ్రతను పరిశోధకులు ఇతర వస్తువులు, పాత్రలతో పోల్చారు. కిచెన్ సింక్తో పోలిస్తే మంచినీళ్ల బాటిల్పై రెండు రెట్లు అదనంగా బ్యాక్టీరియా ఉందట. ఇక కంప్యూటర్ మౌస్తో పోలిస్తే నాలుగు రెట్లు అదనంగా బ్యాక్టీరియా కనిపించిందట. అయితే, బాటిళ్లపై అధిక సంఖ్యలో బ్యాక్టీరియా వృద్ధి చెందినప్పటికీ వాటిలో అన్నీ ప్రమాదకర ఇన్ఫెక్షన్ కారకాలు కావని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ వైద్య నిపుణులు వెల్లడించారు.‘వాటర్ బాటిళ్ల కారణంగా అనారోగ్యానికి గురైన కేసుల గురించి నేను ఎప్పుడూ వినలేదు. అలాగే ట్యాప్ వాటర్లో కూడా బ్యాక్టీరియా ఉత్పత్తి కాదు. అయితే, మనిషి నోటిలో ఉండే బ్యాక్టీరియాతోనే వాటర్ బాటిళ్లు కలుషితమయ్యే అవకాశం ఉంది’ అని వారు తెలిపారు. అయితే, మంచి నీళ్ల కోసం పునర్వినియోగించే బాటిళ్లను రోజుకు ఒకసారి సబ్బు కలిపిన వేడి నీటితో శుభ్రం చేస్తే అనారోగ్యం బారినపడే ప్రమాదం తగ్గుతుందన్నారు.