ప్రధాని మోదీ ఇంటి పేరు పై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు
- కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాని మోదీ ఇంటి పేరు పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని.. ఈ విషయంలో క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు క్షమాపణలు చెప్పడమంటే న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసినట్టే అవుతుందన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు లో ఓ అఫిడవిట్ దాఖలు చేశారు.2019లో కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘దొంగలందరి ఇంటి పేరు మోదీ అని ఎందుకు ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును రాహుల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ కేసు ‘అసాధారణమైన కేటగిరి’ కిందకు రాదని, తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ‘నేను ఎలాంటి నేరానికీ పాల్పడలేదు. శిక్షార్హమైన నేరం చేయలేదు. క్షమాపణలు చెప్పే తప్పు చేసి ఉంటే ఇప్పటికే చెప్పేవాడిని. ఏ తప్పూ చేయకున్నా క్షమాపణలు చెప్తే అదే పెద్ద శిక్ష అవుతుంది’ అని రాహుల్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందుకు ఫిర్యాదుదారు పూర్ణేశ్ తనను ‘అహంకారి’ అని పేర్కొన్నట్లు రాహుల్ తెలిపారు. తాను ఏ నేరం చేయలేదని, అయినా ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద క్రిమినల్ నేరం మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. సూరత్ కోర్టు తనకు విధించిన జైలు శిక్షను నిలుపుదల చేసి.. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని అఫిడవిట్లో కోరారు.