9 ఏళ్లుగా పంట నష్టం ఇవ్వలేదు.. కానీ ఎన్నికలు వస్తున్నాయనే గుర్తుకు వచ్చింది
- కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్రం, రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం వల్ల ప్రజలు బాధపడుతున్నారని, రైతులకు ఋణమాఫి ఇవ్వడం లేదని, సకాలంలో రుణాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మంగళవారం జనగామ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 9 ఏళ్లుగా పంట నష్టం ఇవ్వలేదు.. కానీ ఎన్నికలు వస్తున్నాయనే సాకుతో పంట నష్టం ఇస్తామని తిరిగారని, కానీ ఎప్పుడూ ఇస్తారో తెలియదని అన్నారు. దేశంలో ధరలు ఈ 9 సంవత్సరాలలో విపరీతంగా పెరిగాయన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించే పనులు చేయలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ట్యాక్స్ వేసి విపరీతంగా పెంచారని మండిపడ్డారు. ఈ రాజకీయ పార్టీలు దేనికోసం పని చేస్తున్నాయని పొన్నాల ప్రశ్నించారు.దేశంలో పేద ప్రజలను పట్టించుకోకుండా, రాజకీయాలే ప్రధాన అంశం అయ్యాయని, తాను నీటి పారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ప్రశ్నలకు 5.45 నిమిషాలలో సమాధానం చెప్పామని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. 57 ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్కు.. ప్రజల కోసం అడిగే అర్హత కూడా లేదా? అని ప్రశ్నించారు. ఈ ప్రజా స్వామ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మ్యానిఫెస్టోలు ప్రజల ముందు ఉంచి.. చర్చకు రావాలని సవాల్ చేశారు.ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సభ నుంచి వర్చువల్గా ప్రారంభించడం సరైందా? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. 2014 నుంచి 2022 నాటికి రూ. 21 కోట్ల వాహనాల సంఖ్య పెరిగిందని.. దానికి అనుగుణంగా జాతీయ రహదారులు వేశారా? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఎన్నికలు కాబట్టి జాతీయ రహదారులు తెస్తున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు శిక్షిస్తారని, మోదీ తీహార్, కేసీఆర్ చంచల్ గూడ జైలుకు వెళ్లడం ఖాయమని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.