ఏడుగురి ప్రాణాలు తీసిన టైరు పంచర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తమిళనాడు తిరుపత్తూర్ జిల్లాలో సోమవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అంబూర్కు సమీపంలోని ఒనన్‌కుట్టై చెందిన 45 మంది రెండు టూరిస్ట్‌ మినీ బస్సుల్లో ఈ నెల 8న కర్ణాటకలోని ధర్మస్థలకు వెళ్లారు. యాత్ర పూర్తి చేసుకుని వారంతా తిరిగి వస్తున్న సమయంలో వేకువజామున 2.30 గంల ప్రాంతంలో తిరుపత్తూర్ జిల్లా నత్రంపల్లి సమీపంలోని చండియూర్ వద్ద ఓ వ్యాన్ టైర్ పంక్చరైంది. బెంగళూరు-చెన్నై 44వ జాతీయ రహదారిపై వాహనాన్ని ఓ పక్కన ఆపి.. డ్రైవర్ టైర్ మార్చుతున్నాడు. ఆ సమయంలో మినీ బస్‌లోని కొందరు కిందకు దిగి వ్యాన్ దగ్గరే నిల్చుని ఉన్నారు.

అదే సమయంలో వేగంగా దూసుకువచ్చిన మినీ లారి ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొట్టింది. టూరి వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో అక్కడే నిల్చున్న ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది వరకు గాయపడ్డారు. మృతులను ఎం మీనా (50), డీ దేవయాని (32), పీ సైత్తు (55), ఎస్‌ దేవిక (50), వీ సావిత్రి (42), కే కళావతి (50), ఆర్‌ గీత (34)గా గుర్తించారు. మృతులను వేలూరు జిల్లాలోని పెర్నంబుట్‌ పట్టణానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నాట్రంపల్లి పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ పెట్రోలింగ్‌ వాహనాలు క్షతగాత్రులను కృష్ణగిరి, తిరుపత్తూరు, వాణియంబాడి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.