ఒకప్పుడు వలసలు వెళ్లిన పాలమూరుకే నేడు పొరుగు రాష్ట్రాల నుండి కూలీలు వలస వస్తున్నారు
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: మహబూబ్నగర్, రంగారెడ్డి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇవాళ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు పాలమూరు బిడ్డ హైదరాబాద్లో అడ్డా కూలీ. కానీ ఇవాళ పాలమూరుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. స్థానికులు ఇక్కడే తమ పొలాలు పని చేసుకుంటున్నారు. పాలమూరు బిడ్డల మారిన ముఖచిత్రం ఇది అని కేసీఆర్ తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.తెలంగాణ ఉద్యమంలో పర్యటించినప్పుడు.. మీకు మాటిచ్చాను. రాష్ట్రం వస్తేనే సకల దరిద్రలు మాయవవుతాయి అని తెలిపాను. మన హక్కులు, నీళ్లు వస్తాయని చెప్పాను. కష్టపడి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. పాలమూరు ఎంపీగానే తెలంగాణ సాధించాను. ఇది ఒక చరిత్ర. ఈ జిల్లా కిర్తికీరిటంలో శాశ్వతంగా ఉంటుంది. మొత్తం తెలంగాణలో అంచనాలు వేసుకుని, మనకు రావాల్సిన వాటాలు లెక్కలు కట్టుకుని మూడు పెద్ద ప్రాజెక్టులు చేపట్టాం. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల.. ఈమూడు పూర్తయితే తెలంగాణ వజ్రం తునకలా తయారై దేశానికే అన్నం పెడుతాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. సీతారామ పనులు చకచక జరుగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల కూడా మూడు నాలుగేండ్ల కిందనే పూర్తయితుండే. కానీ మహబూబ్నగర్లో ఉండే గత్తర బిత్తర నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ ఉండే దద్మమ్మ రాజకీయ నాయకులు శత్రువులుగా మారి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు.
2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాతే జూరాల పనులు..
1975లో బచావత్ తీర్పు ఇచ్చే టైంలో మహబూబ్నగర్ నీళ్లు ఏవని నాటి పాలమూరు పాలకులు అడగలేదని కేసీఆర్ గుర్తు చేశారు. ఆంధ్రాతో తెలంగాణను కలపకుండా ఉంటే.. ఈ ప్రాంతం బాగుపడేది అని బచవాత్ జడ్జిలే అన్నారు. 17 టీఎంసీలతో జూరాల మంజూరు చేస్తున్నామని బచావత్ జడ్జిలే చెప్పారు. సాంకేతిక కారణాలు చెప్పి మేం చూసించిన చోటే కట్టాలని నిబంధన పెట్టారు. 1981 దాకా జూరాలలో ఆంధ్రా పాలకులు తట్టెడు మట్టి తీయలేదు. తెలంగాణ వ్యక్తి అంజయ్య సీఎం అయ్యాక శంకుస్థాపన చేశారు. 2001 గులాబీ జెండా ఎగిరిన తర్వాత.. మీటింగ్ పెట్టిన తర్వాత గర్జించిన తర్వాత చంద్రబాబును ప్రశ్నిస్తే.. సమగ్రాభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తే.. జూరాల కాల్వ పనులు చేయించారని కేసీఆర్ గుర్తు చేశారు.