ఫిబ్రవరి 15 వరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రతీ ఏటా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్కు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ నలుమూలల నుంచి వ్యాపారులు స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు. వేలల్లో స్టాల్స్తో దేశవ్యాప్తంగా లభించే అన్ని వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉండడం నుమాయిష్ ప్రత్యేకత. ఇదిలా ఉంటే ప్రతీ ఏటలాగే ఈ సారి కూడా నుమాయిష్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. 82 ఏళ్లుగా తెలంగాణలో ఏటా నుమాయిష్ నిర్వహిస్తున్నారు.
ఈసారి జనవరి 1వ తేదీ (నేటి) నుంచి నుమాయిష్ ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నుమాయిష్ను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ను నిర్వహించనున్నారు. ఈసారి 2500 వరకు స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని అధికారులు తెలిపారు. ఇక ఈసారి గతం కంటే అట్టహాసంగా నిర్వహిస్తామని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగనున్న నుమాయిష్ నేపథ్యంలో సోమవారం నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర సీపీ కే. శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా పలు మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు.