టి ఆర్ ఎస్ పరువు తీసిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసీఆర్ వ్యూహంతో ముందుకు సాగుతుంటే.. బాధ్యతాయుత స్థానంలో ఉన్న మంత్రి మల్లారెడ్డి ఏం చేయాలి?  ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలి?  ఆయనకున్న సీనియార్టీని రంగ రించి.. ప్రజలను ఎలా మచ్చిక చేసుకోవాలి?- కానీ.. ఇవన్నీ.. ఆయన పట్టించుకోలేదు. కేవలం మందు సీసానుమాత్రమే నమ్ముకున్నట్టు వ్యవహరించారు. బీజేపీ నేతలు చెబుతున్నట్టుగా.. “కేసీఆర్ టీం.. మునుగోడుకు వచ్చేది మందు.. విందు.. చిందుల కోసమే” అన్నట్టుగా మల్లారెడ్డి వ్యవహరించారు.మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి రెడ్డి వర్గం ఎక్కువగా ఉన్న చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామం ఇన్చార్జిగా మంత్రి మల్లారెడ్డి నియమితులయ్యారు. అయితే అందరిలా కాకుండా మల్లారెడ్డి ఓటర్లను ఆకట్టుకోవడానికి తనదైన శైలిలో పని మొదలుపెట్టారు. చౌటుప్పల్ సమీపంలోని ఒక హోటల్ ను బుక్ చేసుకుని గత కొద్ది రోజులుగా మంత్రి మల్లారెడ్డి తాగినోడికి తాగినంత మందు పోస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిని స్థానిక టీఆర్ ఎస్ నేతలు ఖండించారు.ఈ క్రమంలో తాజాగా మంత్రి మల్లారెడ్డి ఆదివారం ప్రచారం ముగించుకుని తమ పార్టీ నాయకులతో కలిసి హోటల్ కు వెళ్లి అక్కడ వారికి మందు పోస్తూ విందులో పాల్గొన్న ఫోటోలు  నెట్టింట వైరల్ గా మారడం.. టీఆర్ ఎస్ను తల ఎత్తుకోకుండా చేశాయి.  మంత్రి హోదాలో ఉన్న మల్లారెడ్డి స్వయంగా లిక్కర్ పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లను బాహాటంగా ప్రలోభ పెడుతున్నా టిఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవడం లేదని అధికారులు కూడా టీఆర్ఎస్ పార్టీకి వత్తాసుగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇక బీజేపీ నాయకులు మునుగోడు ఉప ఎన్నికల్లో తాము చెప్పిందే నిజమని మందు విందులతో పాటు వేల రూపాయల డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఖచ్చితంగా ఈసీ దృష్టిసారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక తాజాగా వైరల్ అవుతున్న మంత్రి మల్లారెడ్డి ఫోటోలపై టీఆర్ ఎస్ నేతలు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.