త్వరలో ఆంధ్రప్రదేశ్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)గా మారిన టిఆర్ఎస్.. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కార్యాలయం తెరవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయడానికి ఏపీలో పార్టీ బలం పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వెల్లడించాయి. ఏపీలో బిఆర్ఎస్ వ్యవహారాలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలో బిఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుకు అద్దె భవనం కోసం చూస్తున్నట్లు సమాచారం.

 

పార్టీ కార్యాలయాన్ని జనవరిలో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించి, వేగవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ నెంబర్ కేటాయించారు. 9491015222 నెంబరుకు ఫోన్ చేసి పార్టీ సభ్యత్వం పొందవచ్చని ఇప్పటికే ప్రకటించారు.
గతంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు. అదే పద్ధతిని బీఆర్ఎస్ విషయంలోనూ పాటించాలని నేతలు భావిస్తున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందిన నాయకులను కలిసి బిఆర్ఎస్ లో చేరాలంటూ కెసిఆర్ కోరనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. గతంలో తనతో సన్నిహితంగా ఉన్న ఏపీ నేతలకు ఈ విషయంపై కేసీఆర్ ఇప్పటికే ఫోన్ చేసినట్లు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.