మలుపు తిరగనున్న టిఎస్పిఎస్సి కేసు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరగనుంది. ఈ కేసును విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. దీనిపై నేడు కేసునమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి తొలుత బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత దాన్ని సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు గ్రూప్‌-1 పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులను సైతం విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనుంది. సైబరాబాద్‌ పోలీసులు బట్టబయలు చేసిన డేటా లీకేజీపైనా ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేసింది. కాగా ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మొత్తం 6 పరీక్షలకు సంబంధించి 15 ప్రశ్నపత్రాలను సిట్‌ అధికారులు గుర్తించారు. కమిషన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డిలు వాటిని లీక్‌ చేసి లక్షల సొమ్మును వెనకేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు మొత్తం ఏడు పరీక్షలు నిర్వహించగా వాటిలో అయిదు ప్రశ్నపత్రాలు లీక్‌ అయినట్లు నిర్ధారణ అయింది. కమిషన్‌ కార్యదర్శి వద్ద పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్‌ ఏఈ ప్రశ్నపత్రాన్ని తన స్నేహితురాలు రేణుకకు రూ.10 లక్షలకు అమ్మాడు. ఆ తర్వాత రేణుక, ఆమె భర్త డాక్యానాయక్‌ దాన్ని మరో ఐదుగురికి అమ్మి రూ.25 లక్షల వరకూ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్రూప్‌ 1 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన లావాదేవీలు ఇంకా తెలియరాలేదు. ఈ లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకే ఈడీ రంగంలోకి దిగుతోంది.

Leave A Reply

Your email address will not be published.