శ్రీవారి సేవపై టీటీడీ కీలక ప్రకటన
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: స్వచ్ఛంద సేవ అయిన శ్రీవారి సేవ (Srivari Seva) లో పాల్గొనే భక్తులు సేవ కొరకు ఎవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని, ఆన్ లైన్ విధానం ద్వారా మరింత పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయించడం జరుగుతుందని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) తెలిపారు. శ్రీవారి సేవ ఆన్ లైన్ ద్వారా మాత్రమే కేటాయించడం జరుగుతుందని, ఎవరైనా డబ్బులు తీసుకుని సేవ తీసిస్తామంటే భక్తులు నమ్మవద్దని ఆయన చెప్పారు. సేవ సాప్ట్ వేర్ కచ్చితంగా ఉంటుందని, టీటీడీ సర్వర్ ను ఎవరు హ్యాక్ చేయలేరన్నారు. శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా అమ్మ అని పిలవాలన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపిస్తుంది. శుక్రవారం నాడు 69,270 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శన అనంతరం కానుకల రూపంలో హుండీలో శ్రీవారికి రూ.3.74 కోట్ల రూపాయలు చెల్లిచారు భక్తులు. ఇక శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీవారి దర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. ఇక శుక్రవారం నాడు 28,755 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.