ఏపీ ప్రభుత్వ సలహాదారుపై తులసి రెడ్డి ధ్వజం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఏపీ ప్రభుత్వ సలహాదారులపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియతో మాట్లాడారు. ‘‘సలహాదారులు కాదు.. స్వాహాదారులు. ఒక్క మైనారిటీ శాఖకే నలుగురు సలహాదారులా! వైసీపీ నాయకులకు ఉపాధి హామీ పథకం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కడు దయనీయం. మింగమెతుకు లేదు.. మీసాలకు సంపంగి నూనె అన్నట్లు ఒక్కొక్క సలహాదారుని మీద నెలకు రూ.5 లక్షలు ఖర్చు. సలహాలు ఇచ్చిందీ లేదు.. స్వీకరించిందీ లేదు. కోర్టులు అక్షింతలు వేసినా పట్టించుకోవడం లేదు. సలహాదారుల నియామకానికి స్వస్తి పలకాలి.’’ అని ఆయన కోరారు.ఒక వైపు పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించకుండా మోడీ ప్రభుత్వం భారత రాష్ట్రపతిని అవమానిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీ ప్రాపకం కోసం ప్రాకులాడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా.. చంద్రబాబు చెక్క భజన బాబుగా మారడం శోచనీయమని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.