తూర్పు సిరియాలో ఆయుధ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తూర్పు సిరియాలో ఉన్న రెండు ఆయుధ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఆ కేంద్రాల వద్ద ఇరాన్ దళాలతో పాటు అనుబంధ గ్రూపులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దేశ రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఈ విషయాన్ని తెలిపారు. ఇరాక్, సిరియాల్లో ఉన్న అమెరికా దళాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ దాడులకు పాల్పడినట్లు మంత్రి చెప్పారు. ఇరాన్ అండతో దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్ గ్రూపులను కట్టుడి చేయాలన్న ఉద్దేశంతో అమెరికా వైమానిక దాడులు చేసింది.ఇరాన్ ప్రోద్బలంతో అమెరికా దళాలపై దాడులకు దిగుతున్నారని, దీన్ని ఆపాలని మంత్రి లాయిడ్ కోరారు. తమ దళాలపై దాడులు చేస్తూనే, ఇరాన్ తన జోక్యాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇరాన్ మిలిటెంట్ల దాడులు ఎక్కువైతే దానికి తగిన మూల్యం ఆ దేశం చెల్లించుకోవాల్సి వస్తుందని రక్షణ మంత్రి లాయిడ్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్, హమాస్తో సంబంధం లేకుండా ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. ఇటీవల ఇరాన్ మిలిటెంట్లు చేసిన దాడిలో సిరియాలో ఉన్న అమెరికాకు చెందిన సుమారు 21 మంది సైనికులు గాయపడ్డారు.సిరియాపై చేసిన లక్ష్యిత దాడుల్లో వెపన్స్, అమ్యూనిషన్ స్టోరేజ్ ఏరియాను పేల్చివేసినట్లు పెంటగాన్ తెలిపింది. రెండు ఎఫ్-16 ఫైటర్ విమానాలు ఈ దాడులు చేశారు. ఇరాకీ బోర్డర్ వద్ద ఉన్న బౌకుమాల్ పట్టణంపై అటాక్ జరిగింది. ఇరాన్, సిరియా, లెబనాన్కు ఈ ప్రాంతం నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు పెంటగాన్ గుర్తించింది. ఇరాన్కు చెందిన మిలిటెంట్లు, ఐఆర్జీసీ దళాలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు తేలింది. అమెరికా దళాలపై వాడిన ఆయుధాలు ఆ స్టోరేజ్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించామని రక్షణశాఖ అధికారి తెలిపారు.