సామాన్యుల కోసం ‘వందే మెట్రో’ ట్రైన్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వేతన జీవులకు ఊరటనివ్వడంతోపాటు.. రైతులు, నిరుద్యోగులకు, పారిశ్రామికరంగాలకు కేంద్రం అధిక కేటాయింపులు జరిపింది. కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఇండియన్ రైల్వేకు భారీగా కేటాయింపులు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.2.41 లక్షల కోట్లను కేటాయించింది. 2013-14 సంవత్సరంతో పోలిస్తే ఈ రైల్వే బడ్జెట్ దాదాపు 9 రెట్లు ఎక్కువ.. బడ్జెట్లో అతిపెద్ద కేటాయింపు కూడా ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. రైల్వేకు అధిక కేటాయింపుల అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. పెద్ద నగరాలకు సమీప ప్రాంతాలకు వేగంగా రాకపోకలు జరిపేందుకు వీలుగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మినీ వెర్షన్ ‘వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. సామాన్యులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు వెసులుబాటుగా, అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వందే భారత్‌ తరహాలోనే ‘వందే మెట్రో’లను కూడా అభివృద్ధి చేస్తున్నామని, డిజైన్, ఉత్పత్తి ఈ ఏడాదే ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు.

పెద్ద నగరాల చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు పనికోసం నగరానికి వచ్చి మళ్లీ తమ స్వస్థలాలకు చేరుకునేలా వందేభారత్‌ మెట్రోని తీసుకురావాలని ప్రధానమంత్రి సంకల్పించారని, దానికనుగుణంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. వందే మెట్రోల రూపకల్పన, తయారీ ఈ ఏడాదే పూర్తవుతుందని.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ రైళ్ల ఉత్పత్తిని సైతం పెంచుతామని రైల్వే మంత్రి అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.