ఎమ్మెల్సీ ఎన్నికల కు విజయసాయిరెడ్డి దూరం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కి వెన్నుదన్నుగా నిలిచిన ఎంపీ విజయసాయిరెడ్డి నేడు మాత్రం ఆయనకు ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కు విజయసాయిరెడ్డి దూరంగా ఉన్నారు. వైజాగ్ లో విజయసాయిరెడ్డి తన ఓటును నమోదు చేసుకున్నారు. అనంతరం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకు వైసీపీ తరుఫున పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతుగా నిలవాల్సిన విజయసాయిరెడ్డి.. ఢిల్లీకి వెళ్లిపోయారు. వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించిన తరువాత విజయసాయిరెడ్డి అలకబూనినట్టు తెలుస్తోంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికీ విజయసాయిరెడ్డి దూరంగా ఉన్నారు. అసలు జగన్కు విజయసాయిరెడ్డికి ఇటీవలి కాలంలో సరిగా పడటం లేదన్న టాక్ అయితే జిల్లాలో నడుస్తోంది. సినీ నటుడు తారకరత్న అంత్యక్రియల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తో విజయసాయిరెడ్డి చనువుగా ఉండటంపై జగన్ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు, లోకేశ్ లకు వ్యతిరేకంగా మాట్లాడాలని విజయసాయిరెడ్డిని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ జగన్ ఆదేశాలను పక్కన పెట్టి విజయసాయిరెడ్డి ఢిల్లీ కి వెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలోనే జగన్ మరింత ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.