మణిపూర్ లో మరోసారి చెలరేగిన హింస

.. ఇద్దరి మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో శుక్రవారం మరోసారి హింస చెలరేగింది. తెంగ్నౌపాల్‌ జిల్లాలోని పల్లెల్‌ పట్టణంలో సాయుధ స్థానికులు భద్రతా బలగాల మధ్య భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. 20 మందికిపైగా గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అక్కడ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అస్సాం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసులతో కూడిన భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నట్లు వారు పేర్కొన్నారు.కాగా, బుధవారం రోజున కూడా ఆ రాష్ట్రంలో హింస చెలరేగింది. బిష్ణుపూర్‌ జిల్లాలోని ఫౌగగ్చావో ఇఖాయ్‌లో కోఆర్డినేటింగ్‌ కమిటీ ఆఫ్‌ మణిపూర్‌ ఇంటిగ్రిటీ (సీవోసీవోఎంఐ) పిలుపు మేరకు వేలాది మంది ఆందోళనకారులు.. భద్రతా బలగాలు తమ జిల్లా వైపున ఏర్పాటు చేసిన బారికేడ్లను చురాచంద్‌పూర్‌ వైపునకు నెట్టేందుకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా ఆందోళనకారులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులను ఫౌగగ్చావో ఇఖాయ్‌ వద్దకు రానివ్వకుండా క్వక్టా వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు బిష్ణుపూర్‌ జిల్లాలోని ఓయినం వద్ద స్థానికులు వందలాదిగా బయటకు వచ్చి రోడ్డును దిగ్భందించారు. ఇంఫాల్‌ నుంచి ఫౌగగ్చావో ఇఖాయ్‌ వెళ్తున్న భద్రతా బలగాలను అడ్డుకొన్నారు.

Leave A Reply

Your email address will not be published.